హైదరాబాద్:
ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, గొప్ప ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం ఘనంగా నివాళులర్పించారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం:
తన సందేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సమాజ అభివృద్ధికి, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. తమ జ్ఞానం, మార్గదర్శకత్వం, సహనం మరియు అంకితభావంతో విద్యార్థులను భావి భారత పౌరులుగా మలుస్తున్నారని ఉపాధ్యాయ లోకాన్ని కొనియాడారు.
ఈ ఏడు రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను కొడంగల్లో నిర్వహించి, ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

