హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారమ్ల డిజిటైజేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ప్రగతి వెనుకబడిన అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
మంగళవారం సీఈఓ సుదర్శన్ రెడ్డి, అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ జీఎస్ చారీలతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో (DEOs) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వారాంతానికి అన్ని జిల్లాల్లో ఎన్యూమరేషన్ నమోదు ప్రక్రియ కనీసం 90 శాతం మార్కును దాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ‘మ్యాపింగ్ లేని’ (No Mapping) ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆధార్ తప్పనిసరి కాదు.. బీఎల్వోలకు ఆదేశాలు
ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారమ్లను సమర్పించిన ఓటర్లను భౌతిక ప్రతి (Physical Form) కోసం వేధించవద్దని బూత్ స్థాయి అధికారులకు (BLOs) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సీఈఓ అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా, ఎన్యూమరేషన్ ఫారమ్ల సమర్పణకు ఆధార్ కార్డ్ను తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆబ్సెంట్ (Absent), షిఫ్టెడ్ (Shifted), మరణించిన (Dead) – ఎస్ఈడీ కేసుల వివరాలను చాలా జాగ్రత్తగా తనిఖీ చేసి, కచ్చితమైన రికార్డులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

