నాగర్కర్నూల్: జిల్లాలోని రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద గల మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్-3 పంప్ హౌస్ను బిఆర్ఎస్ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శ్రీశైలంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతుంటే, పాలమూరు ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నా ఇక్కడి రైతులకు నీరు అందకపోవడం విచారకరమన్నారు. విద్యుత్ సరఫరా సమస్యల వల్ల పంప్ల నిర్వహణ దెబ్బతింటోందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యాసంగి పంటలకు నీరందించాలని డిమాండ్ చేశారు.

