హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పంచాయతీల సొంత ఆదాయం ప్రభుత్వ ట్రెజరీలతో సంబంధం లేకుండా నేరుగా వాటి స్థానిక బ్యాంకు ఖాతాల్లోనే జమ అయ్యేలా ‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018’లోని సెక్షన్ 70(3)కి సవరణ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శాసనసభ వేదికగా ప్రకటించారు.
ఇప్పటివరకు సొంత ఆదాయం ట్రెజరీలో జమ కావడంతో నిధులు విత్డ్రా చేసుకోవడానికి తీవ్ర విలంబం జరుగుతోందని మంత్రి తెలిపారు. సవరించిన నూతన విధానం ద్వారా తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీల మరమ్మతులు వంటి అత్యవసర స్థానిక పనులకు నిధులను తక్షణమే వినియోగించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ఆశయాలకు అనుగుణంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

