Breaking News

దళితులపై వేధింపులు: బిఆర్‌ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీ!

దళిత వర్గాలను అవమానిస్తున్నారంటూ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్, బిజెపిల దళిత వ్యతిరేక చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. పాత బస్టాండ్ సెంటర్ లోని సంజీవరెడ్డి భవన్ (డిసిసి కార్యాలయం) నుంచి జిల్లా పరిషత్ కార్యాలయ సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు 1,000 మందికి పైగా పార్టీ కార్యకర్తలు జెండాలు చేతబూని, రెండు పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలు దళిత సమాజాన్ని అవమానించేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లో దళిత వర్గానికి చెందిన ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సందర్శించిన ప్రాంతాన్ని బిజెపి కార్యకర్తలు నీళ్లతో కడిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

అలాగే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (దళిత నేత)పై బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వాడిన భాషను ఆయన తీవ్రంగా ఖండించారు. తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు కాంగ్రెస్ దళిత నేతలు నిరసన తెలిపాక, ఆ రోడ్డును బిఆర్‌ఎస్ నాయకులు కడిగించి శుభ్రం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, బిఆర్‌ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి నిరూపితమైందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిఆర్‌ఎస్ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టిస్తోందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *