నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పంట పొలాలు కీలకమైన పొట్ట దశకు చేరుకున్న సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగవుతున్న సుమారు 6 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు రోజుకు కనీసం 18 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించాలని కోరారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైతే పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించి అయినా సరే.. కనీసం నెల రోజుల పాటు రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

