తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ (TTD) అధికారికంగా ఆహ్వానించింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకిదేవితో పాటు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేకంగా వేదాశీర్వచనం అందించారు.
అనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేశవిదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, దర్శనం, వసతి, భద్రత మరియు ప్రసాదాల పంపిణీ విషయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

