రోజుకు ఐదారు గంటలే విద్యుత్ సరఫరా
పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి
24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్
నిజాంసాగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).
మండలంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు జాతీయ రహదారి 161పై ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో విద్యుత్ సరఫరా కావడం లేదని, రోజుకు కేవలం ఐదారు గంటలు మాత్రమే విద్యుత్ వస్తుండటంతో మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు పేర్కొన్నారు.
అప్పులు చేసి సాగు చేసిన పంటలకు సకాలంలో నీరందకపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలను కాపాడేందుకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తొలగించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ధర్నా కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

