సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. పంట పొలాలకు అవసరమైన సమయంలో సరిపడా కరెంట్ అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మండల పరిధిలోని ఎర్కారం సబ్స్టేషన్ ఎదుట జనగాం రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
రైతుల హఠాత్ ఆందోళనతో జనగాం రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విమర్శలు గుప్పించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఉండేదని, ప్రస్తుతం అవసరమైన స్థాయిలో కూడా కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరంతర విద్యుత్ సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

