విద్యార్థులకు నాణ్యమైన భోజనం.. మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
పేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
భైంసా జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. పేద విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులపై ఉందన్నారు.
శుక్రవారం భైంసాలోని తన నివాసంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కో పాఠశాల ప్రిన్సిపాల్తో ప్రత్యేకంగా మాట్లాడి విద్యార్థుల అడ్మిషన్లు, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించడంతో పాటు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
రూ.45 లక్షలతో ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులు
ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తమ పాఠశాలను సందర్శించి సమస్యలను గుర్తించడంతో పాటు రూ.45 లక్షల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు పూర్తి చేయించారని తెలిపారు. విద్యారంగంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో కస్తూర్బా, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, ఆదర్శ, గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

