ముధోల్ పోస్టాఫీసును సందర్శించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ 4వ తరగతి విద్యార్థులు
ముధోల్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)
విద్యార్థులకు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో బోధించాలనే ఉద్దేశ్యంతో ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థులు శనివారం స్థానిక పోస్టాఫీసును క్షేత్రస్థాయిలో సందర్శించారు. విజ్ఞానశాస్త్రం బోధనలో భాగంగా నిర్వహించిన ఈ విద్యా పర్యటనలో విద్యార్థులు పోస్టాఫీసు పనితీరు, ప్రజలకు అందిస్తున్న వివిధ పోస్టల్ సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పోస్టుమాస్టర్ గంగయ్య విద్యార్థులకు పోస్టాఫీసు నిర్వహణ, ఉత్తరాలు, పార్శిళ్లు, స్పీడ్ పోస్టు, పొదుపు ఖాతాలు, ఇతర తపాలా సేవల గురించి సులభంగా వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.పోస్టాఫీసు కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులు ఆసక్తి, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి క్షేత్ర సందర్శనలు విద్యార్థుల్లో సాధారణ విజ్ఞానంతో పాటు సామాజిక అవగాహనను పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ క్షేత్ర సందర్శనలో ఉపాధ్యాయులు రమ్య, ప్రసన్న, గౌతమి, కైలాస్ విద్యార్థులతో కలిసి పాల్గొని పర్యవేక్షించారు.

