హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బడుల్లో చదువుకునే విద్యార్థులతో పాటు, అక్కడ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు (Teaching Staff) మరియు బోధనేతర సిబ్బందికి (Non-Teaching Staff) కూడా సీఎం టిఫిన్ (TG Breakfast) మరియు మధ్యాహ్న భోజన (Mid-Day Meal) సదుపాయాన్ని విస్తరిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు (RJD), జిల్లా విద్యాశాఖాధికారులు (DEO), మండల విద్యాశాఖాధికారులు (MEO), ప్రధానోపాధ్యాయులు (HM) మరియు ఉపాధ్యాయ బృందాలకు మార్గదర్శకాలు పంపించారు.
ముఖ్యమైన మార్పులు & పోర్టల్ అప్డేట్:
- ఉపాధ్యాయులకూ మధ్యాహ్న భోజనం: ఇప్పటివరకు కేవలం విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి సిఎమ్ అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనాన్ని ఇకపై పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా విద్యార్థులతో కలిసి స్వీకరించవచ్చు.
- ఆన్లైన్ పోర్టల్లో మార్పులు: ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తినే అల్పాహారం మరియు భోజనానికి సంబంధించిన వివరాలు, లెక్కలు నమోదు చేసేందుకు వీలుగా “TG Breakfast” మరియు “MDM” ఆన్లైన్ పోర్టల్స్లో తగిన మార్పులు (Modifications) చేయాలని మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది.
పాఠశాలల్లో ఆహార నాణ్యత పెరగడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధాన్ని మరింత పెంపొందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

