మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండె కేలూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామానికి కొత్త కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రంలో గ్రామస్తులు పేర్కొన్న వివరాల ప్రకారం, బీసీ కాలనీలో గడ్డివార్ వీరేశంకు అక్రమ నిర్మాణం పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారని తెలిపారు. అయితే అదే ప్రాంతంలో తాము గత 20 ఏళ్లుగా నివాసం ఉంటూ ఇళ్లపై హౌస్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఇళ్లు కూడా అక్రమమని గ్రామస్తుల ఎదుట పదేపదే వ్యాఖ్యానించడం వల్ల ప్రజల్లో అయోమయం, ఆందోళన నెలకొంటోందని ఆరోపించారు.
అలాగే, గడ్డివార్ వీరేశం గ్రామపంచాయతీ స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మించుకున్నప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామపంచాయతీ కార్యదర్శిపై గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ గ్రామంలో విభేదాలు, గొడవలు సృష్టిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.గ్రామంలో శాంతిభద్రతలు, సామరస్య వాతావరణం దెబ్బతింటోందని, ప్రస్తుత గ్రామపంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేదా ఆయన స్థానంలో కొత్త కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు ఎంపీడీఓను కోరారు.ఈ అంశంపై అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.



