బాల్కొండ, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి).
బాల్కొండ మండల వన్నెల్-బి వరద కాలువ గట్టు వద్ద గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో బాల్కొండ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న 18 మందితో పాటు గంజాయి విక్రయించేందుకు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వరద కాలువ గట్టు వద్ద కొంతమంది గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 18 మంది గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. అదే సమయంలో వారికి గంజాయి విక్రయించేందుకు వచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
అతని వద్ద 40 గ్రాముల ఎండు గంజాయి, చిన్న చిన్న జిప్లాక్ కవర్ల ప్యాకెట్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.గంజాయికి బానిసైన మిగతా 18 మందిపై కూడా కేసులు నమోదు చేసి, వారిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంబంధిత పూర్తి వివరాలను త్వరలోనే వివరిస్తామని పోలీసులు తెలిపారు.

