మూడు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి: ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
విశాలమైన భవనంలోకి పాఠశాలను తరలిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు
గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం: వేముల ప్రశాంత్ రెడ్డి
మానాల,ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి)
మానాల మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారుభవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పనుల పురోగతిపై అక్కడి నుంచే ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు స్పందించిన అధికారులు మూడు నెలల్లో మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యేకు తెలిపారు.
విశాలమైన భవనంతో విద్యార్థులకు సౌకర్యం..
భవన నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ప్రస్తుతం వేములవాడలోని తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న పాఠశాలను నూతన భవనంలోకి తరలిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. విశాలమైన భవనంలో విద్యార్థులకు చదువుకోవడంతో పాటు వసతి పరంగా కూడా మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
గిరిజన విద్యార్థులకు ఎంతో మేలు..
మానాల పరిసర ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే స్థానికంగా ఉన్న గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు లభిస్తాయని తెలిపారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


