ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం: ఈడీ సోలమన్
నిజామాబాద్, సెప్టెంబర్ 5: (E6tv NEWS; ప్రతినిధి)
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ తెలిపారు. నిజామాబాద్ రీజియన్లో పర్యటించిన ఆయన వివిధ డిపోల పనితీరును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్లతో సమావేశమైన ఈడీ సోలమన్.. డిపోల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రజా రవాణా సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రీజియన్ పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆదాయాన్ని పెంచడంతో పాటు ఖర్చులను నియంత్రించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. సంస్థ అభివృద్ధికి అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రయాణికుల ఆదరణ పెరిగేలా ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. డిపోల నిర్వహణ, పనితీరు వంటి అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్, వివిధ డిపోల మేనేజర్లు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

