డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు
పాల్వంచ, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి).
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత నేత, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
పాల్వంచ బీసీఎం రోడ్డులో దండోరా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆయన మనుమడు, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమారి కుమారుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ అన్షుల్ అవిజిత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు.అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య, మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అన్షుల్ అవిజిత్కు ఘన సన్మానం
జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పాల్వంచకు వచ్చిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ అన్షుల్ అవిజిత్ను కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాల్వ భాస్కర్ రావు, బానోత్ బాలు నాయక్, కాంగ్రెస్ నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య, మహిపతి రామలింగం, వై. వెంకటేశ్వర్లు, కొండం వెంకన్న గౌడ్, ధర్మసోత్ ఉపేందర్, షేక్ గద్దర్ బాషా, కొండూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


