మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ సక్సెస్.. రైతుల్లో ఆనందోత్సాహాలు
అశ్వాపురం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).
తుమ్మల చెరువు రైతుల చిరకాల సాగునీటి కల సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో చేపట్టిన మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో తుమ్మల చెరువు ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
గోదావరి జలాలను తుమ్మల చెరువుకు తరలించి తమ పొలాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాంత రైతుల ఏళ్లనాటి కోరిక. ఈ డిమాండ్ను నెరవేర్చేందుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులతో సమన్వయం చేస్తూ ప్రత్యేకంగా కృషి చేశారని రైతులు తెలిపారు.ఈ క్రమంలో ఆదివారం మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్కు ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు, సిబ్బంది, రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అధికారులకు, సిబ్బందికి స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పచ్చని పంటలపై ఆశలు
మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు తుమ్మల చెరువుకు చేరడంతో ఆయకట్టు పరిధిలో సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంటలకు నీటి భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.గోదావరి జలాలు మా పొలాలకు చేరి పచ్చని పంటలు పండితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ట్రయల్ రన్ విజయవంతం కావడం మా చిరకాల కోరిక నెరవేరే దిశగా తొలి అడుగు. ఇది రైతులందరికీ పండుగ రోజు” అని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో తుమ్మల చెరువు రైతుల సాగునీటి ఆశలు చిగురించాయి. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తమ ప్రాంతంలో వ్యవసాయానికి మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.




