అమరావతి: ప్రభుత్వ దస్త్రాల (ఫైళ్ల) పరిష్కారంలో జాప్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, పాలనలో వేగం పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లకు పరిపాలనపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచేందుకు రాబోయే నెల రోజుల్లో అన్ని శాఖల దస్త్రాలను పూర్తిగా ఆన్లైన్లోకి మార్చాలని, గడువు తర్వాత భౌతిక (మాన్యువల్) ఫైళ్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సుకు గైర్హాజరైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సిబ్బందికి స్పష్టమైన జాబ్ ఛార్ట్ సిద్ధం చేయాలని మరియు ప్రతి కార్యాలయానికి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అందించాలని సీఎం సూచించారు.

