హైదరాబాద్ / న్యూఢిల్లీ:
ప్రస్తుత ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన స్థాయిలో ఎరువుల నిల్వలను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మెదక్ బిజెపి ఎంపీ ఎం. రఘునందన్ రావు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ గురువారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
ఏప్రిల్ 1 నుండి జులై 26 మధ్య కాలంలో రాష్ట్రంలో ఎరువుల లభ్యత అవసరాల కంటే అదనంగానే ఉందని, ఎక్కడా ఎలాంటి కొరత లేదని మంత్రి తెలిపారు.
లోక్సభలో కేంద్ర మంత్రి వెల్లడించిన ముఖ్యాంశాలు:
- ఎరువుల పర్యవేక్షణ: రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ శాఖ ప్రతి పంట కాలానికి ముందు నెలవారీ ఎరువుల అవసరాలను అంచనా వేస్తుందని తెలిపారు. డిజిటల్ iFMS (ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్) పోర్టల్ ద్వారా ఎరువుల సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
- ఆర్ఎఫ్సీఎల్ (RFCL) విస్తరణ ప్రతిపాదన లేదు: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్లాంట్ విస్తరణకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.
- యూరియా కేటాయింపులు: ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అయ్యే యూరియాను జాతీయ పూల్కు చేర్చి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా, అవసరాలకు అనుగుణంగా కేటాయిస్తున్నట్లు వివరించారు.
రైల్వే రవాణా & జిల్లాల్లో పంపిణీ బాధ్యత:
రైల్వే మంత్రిత్వ శాఖతో క్రమం తప్పకుండా సమన్వయం చేసుకుంటూ ఎరువుల రేక్లను (Fertiliser Rakes) ప్రాధాన్యతా క్రమంలో వేగంగా తరలిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, రాష్ట్రానికి చేరిన ఎరువులను జిల్లా స్థాయిలో రైతులకు సకాలంలో పంపిణీ చేయాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి అనుప్రియ పటేల్ స్పష్టం చేశారు.

