సిద్దిపేట: జిల్లాలోని చేర్యాల మండలం అర్జున్పట్ల గ్రామంలో ఉన్న ‘సింప్లీ ఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్’ (Simply Fresh Private Limited) కంపెనీలో మహిళా కార్మికులపై సూపర్వైజర్ వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది. సూపర్వైజర్ వేధింపులను నిరసిస్తూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ కార్మికులు కంపెనీ ముందు భారీ ధర్నాకు దిగారు.
పనివేళల్లో వాష్రూమ్కు (టాయిలెట్కు) వెళ్లకుండా సూపర్వైజర్ తమను అడ్డుకుంటున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, “టాయిలెట్కు వెళ్లే బదులు డైపర్లు వేసుకోండి” అంటూ అసభ్యకరంగా మాట్లాడి హేళన చేశారని ఆరోపించారు. సూపర్వైజర్కు అనుకూలంగా ఉండే వారికి జీతాలు పెంచి, ఇతరులను అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికుల ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు.

