!
హైదరాబాద్, బంజారాహిల్స్: సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఆమె తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కొడంగల్లో భారీగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడిన ముఖ్యాంశాలు:
ఒకే ఓటరు.. రెండు రాష్ట్రాలు!
కర్ణాటకలోని సెడం నియోజకవర్గానికి చెందిన దాదాపు 11 వేల మంది ఓటర్ల పేర్లు కొడంగల్ ఓటరు జాబితాలో కూడా ఉన్నాయని కవిత ఆరోపించారు. ఇలాంటి అంతర్రాష్ట్ర (ఇంటర్ స్టేట్) డూప్లికేట్ ఓటర్లతో పాటు, నియోజకవర్గంలో మరో 22,433 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇందులో ఇప్పటికే తాము 1,000 ఓట్లకు సంబంధించిన పక్కా ఆధారాలను సేకరించినట్లు వెల్లడించారు.
“డూప్లికేట్ ఓట్లు, కర్ణాటక ఓటర్ల సంఖ్య కలిపితే దాదాపు 33 వేల ఓట్లు అవుతాయి. గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపు ఇదే స్థాయి మెజార్టీతో గెలిచారు. ఈ లెక్కలు చూస్తుంటే ఎన్నికల సంఘం వ్యవహారంపై అనుమానాలు కలగక మానవు.”
— కల్వకుంట్ల కవిత
బోధన్లో 7 వేలు.. కొడంగల్లో 808 మాత్రమే ఎందుకు?
నియోజకవర్గాల వారీగా ఓట్ల తొలగింపులో తీవ్ర పక్షపాతం జరిగిందని కవిత ధ్వజమెత్తారు. గత ఏడాదిన్నర కాలంలో బోధన్ నియోజకవర్గంలో ఏకంగా 7 వేలకు పైగా ఓట్లను తొలగించిన అధికారులు.. కొడంగల్కు వచ్చేసరికి కేవలం 808 ఓట్లను మాత్రమే ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఈ వ్యత్యాసం వెనుక ఉన్న మర్మమేంటో ఈసీ సమాధానం చెప్పాలన్నారు.
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ – వన్ ఓటు కావాలి
రూ.1,400 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలోని లోపాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కవిత డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అంతర్రాష్ట్ర డూప్లికేట్ ఓట్లను గుర్తించి, తొలగించే పటిష్టమైన వ్యవస్థ ఎన్నికల సంఘం వద్ద ఉందా? లేదా? అనే విషయాన్ని బహిర్గతం చేయాలన్నారు. దేశంలో “వన్ నేషన్ – వన్ ఎలక్షన్ – వన్ ఓటు” విధానం అమలులోకి వస్తేనే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
బోధన్లో తొలగించిన 7 వేల ఓట్ల పూర్తి వివరాలు, వాటికి సంబంధించిన నోటీసులు, అలాగే తాము కొడంగల్ ఓట్లపై లేవనెత్తిన అన్ని ప్రశ్నలపై ఎన్నికల సంఘం పారదర్శకంగా స్పందించి శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు.
కొడంగల్లో 33 వేల ‘డూప్లికేట్’ ఓట్లు.. సీఎం గెలుపుపై కవిత సంచలన ఆరోపణలు

