సిద్దిపేట: హైవేలపై ప్రయాణించే మహిళలు, వారి కుటుంబాల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజీవ్ రహదారి (Rajiv Rahadari) మార్గంలో ప్రయాణించే పర్యాటకులు, ప్రయాణికుల కోసం ‘షీ సేఫ్’ (SHE SAFE) అనే ప్రత్యేక భద్రతా రక్షణ కేంద్రాల ప్రాజెక్ట్ను సీపీ రష్మీ పెరుమాళ్ శుక్రవారం ప్రారంభించారు.
హైవేపై ప్రయాణించే మహిళలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా సురక్షితంగా విరామం (Stopover) తీసుకునేలా నమ్మకమైన కేంద్రాలను గుర్తించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
‘SHE SAFE’ జోన్గా మారాలంటే ఉండాల్సిన అర్హతలు:
రాజీవ్ రహదారి వెంట ఉన్న హోటళ్లు, దాబాలు, ఫ్యూయల్ స్టేషన్లను (పెట్రోల్ బంకులు) క్షేత్రస్థాయిలో పరిశీలించి, క్రింది నిబంధనలు పాటించే కేంద్రాలను పోలీసులు ‘షీ సేఫ్ జోన్’గా ప్రకటిస్తారు:
- మౌలిక వసతులు: సురక్షితమైన పార్కింగ్ సదుపాయం, శుభ్రమైన మరుగుదొడ్లు (Clean Washrooms), నాణ్యమైన ఆహారం.
- భద్రతా ప్రమాణాలు: నిరంతర సిసిటివి (CCTV) పర్యవేక్షణ, రాత్రివేళల్లో వెలుతురు ఉండేలా కాంతివంతమైన లైటింగ్, నమ్మకమైన సిబ్బంది.
సీపీ రష్మీ పెరుమాళ్ తనిఖీలు & సూచనలు:
ఈ కార్యక్రమంలో భాగంగా సీపీ రష్మీ పెరుమాళ్ శుక్రవారం రాజీవ్ రహదారి వెంట ఉన్న పలు హోటళ్లు, పెట్రోల్ బంకులను స్వయంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సదుపాయాలను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
గతంలోనే వ్యాపార సముదాయాల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించిన సీపీ… సిసిటివి కెమెరాల సంఖ్యను పెంచాలని, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సురక్షిత వాతావరణాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఒక నెల రోజుల్లో ఈ రహదారిలోని ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ పూర్తిస్థాయి ‘సేఫ్ జోన్లు’గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

