హైదరాబాద్: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ విస్తరణ, సమగ్ర పునర్వ్యవస్థీకరణకు సీఎం రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ భారీ మార్పులు జరగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు, సామాజిక సమీకరణలు, పనితీరు ఆధారంగా ముగ్గురు మంత్రులకు కోత విధించి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రధాన ఊహాగానాలు & పొలిటికల్ హైలైట్స్:
- మంత్రివర్గం నుంచి అవుట్?: మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరీ లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్లను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- కొత్త స్పీకర్గా అడ్లూరీ లక్ష్మణ్?: అడ్లూరీ లక్ష్మణ్కు స్పీకర్ బాధ్యతలు అప్పగించి.. ప్రస్తుత స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను కేబినెట్లోకి తీసుకోనున్నారని చర్చ నడుస్తోంది.
- కీలక స్థానాల్లో కొత్త నేతలు:
- జూపల్లి స్థానంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
- పొన్నం ప్రభాకర్ స్థానంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- మంత్రి రేసులో ఉన్న ప్రముఖులు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.
- ఆర్థిక శాఖ మార్పు: కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అప్పగించే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు కానుంది.

