పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్లు


జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చ
నిజామాబాద్, జూలై 25: E6 tv NEWS. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.
హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం జిల్లా జడ్జి జీవీఎన్. భరత లక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి ఆహ్వానించారు.తదుపరి అతిథి గృహంలో జిల్లా జడ్జి, పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్ తదితర ఉన్నతాధికారులతో హైకోర్టు న్యాయమూర్తులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవ్యవస్థ, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై పరస్పరం చర్చించి, సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.
హైకోర్టు న్యాయమూర్తుల జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు, న్యాయవర్గ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వారికి ఘన స్వాగతం పలకడం విశేషంగా నిలిచింది.

