హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముసాయిదా ఓటర్ల జాబితా తనిఖీల్లో భారీగా వ్యత్యాసాలు వెల్లడికావడంతో ఎన్నికల సంఘం నగరానికి చెందిన పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ విఐపీ నోటీసుల జాబితాలో సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు ఉండటం విశేషం.
ఈసీ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కథానాయకుడు మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత, నటుడు వెంకటేష్, నటి సమంత, విజయ్ దేవరకొండలతో పాటు ప్రముఖ క్రీడాకారులు వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్ మరియు వ్యాపారవేత్తలు ఉపాసన కొణిదెల, మురళీకృష్ణ ప్రసాద్ దివి ఉన్నారు. పేర్లలో తప్పులు, తండ్రి పేర్లలో వ్యత్యాసాలు మరియు పాత ఆర్కైవ్లతో వివరాలు సరిపోలకపోవడం వంటి సాంకేతిక లోపాల ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చారు. అయితే విచారణ సమయంలో వీఐపీలు నేరుగా హాజరుకాలేని పక్షంలో తమ ప్రతినిధులను పంపేందుకు ఈసీ మినహాయింపునిచ్చింది.

