అమరావతి: పల్నాడు జిల్లాలోని 84 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న వరికిపుడిశిల ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ స్కీం) పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో డీపీఆర్, భూసేకరణ మరియు సర్వే ప్రక్రియలపై సుదీర్ఘంగా చర్చించారు.
కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న 36 నీటిపారుదల ప్రాజెక్టుల్లో వరికిపుడిశిల కూడా ఒకటని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అక్టోబర్ నాటికి డీపీఆర్, ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మరియు ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 586 ఎకరాల భూసేకరణను రూ.63 కోట్ల అంచనా వ్యయంతో రాబోయే నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు.

