కల్లూరు / ఖమ్మం: రాష్ట్రంలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివార్లలో భారీగా గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు ₹11.55 లక్షల విలువైన 23.10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు.
ఒడిశా టూ హైదరాబాద్.. అంతా పక్కా ప్లాన్! ఈ ముఠా నెట్వర్క్ చాలా పెద్దదని పోలీసులు నిర్ధారించారు.
- తక్కువ ధరకు కొనుగోలు: పాల్వంచకు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ అన్వర్, ఒడిశాలోని మల్కన్గిరికి చెందిన రాజు, కార్తీక్ వద్ద కేవలం ₹3,000 లకే కిలో గంజాయి కొనేవాడు.
- భారీ లాభాలకు విక్రయం: గతంలో జైలు శిక్ష అనుభవించిన అన్వర్, ఈసారి రూటు మార్చి హైదరాబాద్కు చెందిన రాకేష్కు కిలో ₹12,000 చొప్పున హోల్సేల్గా తెగనమ్మేవాడు.
- బంధువులతో సీక్రెట్ డెన్: పోలీసులు నిఘా పెంచడంతో అన్వర్ తన బావమరిది ముజాహిద్ పాషా, బాబాయి వజీర్ ఖాన్లను భాగస్వాములుగా మార్చుకున్నాడు. కల్లూరులోని ముజాహిద్ పాషా ఇంట్లోనే ఈ మత్తు పదార్థాన్ని రహస్యంగా నిల్వ ఉంచేవారు.
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు: బుధవారం పక్కా సమాచారంతో కల్లూరు ఎస్సై డి. హరిత బృందం దాడి చేసి మహమ్మద్ అన్వర్, వజీర్ ఖాన్, ముజాహిద్ పాషా, యూసఫ్గూడకు చెందిన రాకేష్, సికింద్రాబాద్కు చెందిన ఆదిల్లను అరెస్ట్ చేశారు. కాగా, ఒడిశాకు చెందిన ప్రధాన సరఫరాదారులు రాజు, కార్తీక్ పరారీలో ఉన్నారు.
మత్తు ముఠా గుట్టు రట్టు చేసిన సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగయ్య, ఎస్సై హరిత మరియు ఇతర సిబ్బందిని ఏసీపీ వసుంధర యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు.

