Breaking News

పి.ఆర్.సి. బకాయిలు వెంటనే చెల్లించాలి

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల వినతి

భైంసా, జూలై 26: (E6 tv NEWS: తిరుపతి గౌడ్)

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు, పెండింగ్ అలవెన్సులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు, ఇతర అలవెన్సుల చెల్లింపులో జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే వర్షాకాల శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు.అదేవిధంగా, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి దంపతులకు ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లి, శాసనసభలో ప్రస్తావించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *