ఇందూరు, జూలై 30: E6 tv NEWS (శివ ఠాకూర్)
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీలు, నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.గతంలో ఎదురైన ముంపు సమస్యలను దృష్టిలో ఉంచుకుని నాలాలు సరిగా లేని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నగరంలోని ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిల్వ కాకుండా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అధిక వర్షపాతం నమోదైన సందర్భాల్లో నీటిని తొలగించేందుకు భారీ మోటార్లు సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా అధికారులు సిద్ధంగా ఉండాలని ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు.

