Breaking News

పెద్దపల్లిలో భారీ వర్షాలు: సచివాలయం నుంచి మంత్రి శ్రీధర్ బాబు అత్యవసర సమీక్ష!

హైదరాబాద్ / పెద్దపల్లి (E6TV డిజిటల్):
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. జిల్లాలోని వాస్తవ పరిస్థితులు మరియు వర్ష ప్రభావంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, పోలీస్ మరియు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా
సమీక్ష సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు జిల్లాలోని వర్షపాతం, వాగులు-వంకల పొంగుతున్న తీరు, రవాణా పునరుద్ధరణ మరియు లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై సమగ్ర వివరాలను సేకరించారు.
అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు:
ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యం: వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదా ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు: నీట మునిగే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి భోజనం, తాగునీరు అందుబాటులో ఉంచాలి.
క్షేత్రస్థాయిలోనే అధికారులు: కలెక్టర్ నుంచి గ్రామ స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంటూ నిరంతరం అందుబాటులో ఉండాలి.
త్యవసర సేవల లభ్యం: విద్యుత్, వైద్యారోగ్యం, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై యంత్రాంగానికి మంత్రి శ్రీధర్ బాబు దిశా నిర్దేశం చేశారు. పబ్లిక్ ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *