రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి
మాస్కులు ధరించి దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
– మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిసెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి).
సెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి).
వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్రెడ్డి, పీఆర్వో మహేష్లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టిన సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి మహేందర్రెడ్డి, మహేష్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసిందని ఆయన ఆరోపించారు.
విచారణ పేరుతో వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన సమయంలో, పోలీసుల సమక్షంలోనే మాస్కులు ధరించిన సుమారు 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై దాడికి యత్నించడం ఆందోళనకరమని అన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.
పోలీస్ స్టేషన్లోనే దాడికి యత్నించే స్థాయికి అరాచకం పెరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, దాడికి యత్నించిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఘటనపై సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.

