హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ వంశపారంపర్య ఇమామ్ మరియు ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ (AKDN) ఛైర్మన్ అయిన ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ 5తో భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను అధికారికంగా ఆహ్వానించారు. ఈ సమ్మిట్కు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణ మరియు పరిరక్షణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ వహిస్తున్న కీలక పాత్రను ముఖ్యమంత్రి కొనియాడారు. శాసనమండలి భవనం, కుతుబ్ షాహీ తోటల పునరుద్ధరణలో ఫౌండేషన్ కృషిని ప్రశంసించిన సీఎం, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజీ, ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక భవనాల పునరుద్ధరణకు కూడా ఫౌండేషన్ సహకారాన్ని కోరారు. గోషామహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న పురాతన భవనాన్ని హెరిటేజ్ అసెట్గా అభివృద్ధి చేయడంతో పాటు మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని ‘నైట్ ఎకానమీ’ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రిన్స్కు వివరించారు.
అంతకుముందు రోజు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కూడా లోక్ భవన్లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ 5కి ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో అర్బన్ రెన్యూవల్, కమ్యూనిటీ హెల్త్కేర్, మహిళా సాధికారత మరియు ఉపాధి కల్పన రంగాల్లో తమ సంస్థ (AKDN) చేస్తున్న కార్యక్రమాలను ప్రిన్స్ రహీమ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తమ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

