అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సంచలన మైలురాయిని అందుకున్నాడు. పురుషుల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను (4,231 పరుగులు) వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బట్లర్ ఈ ఘనత సాధించాడు.
శ్రీలంకపై కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు సాధించిన బట్లర్, తన మొత్తం టీ20 పరుగుల సంఖ్యను 4,292కి చేర్చుకున్నాడు. ఈ జాబితాలో ప్రస్తుతం పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం (4,596 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ (114 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్ 254 పరుగుల భారీ స్కోరు సాధించి, శ్రీలంకపై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

