16 సెప్టెంబర్… భారత సైనిక చరిత్రలో ఒక మహావీరుడిని స్మరించుకునే రోజు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్ధభూమిలో చివరి శ్వాస వరకు పోరాడిన పరమవీర చక్ర గ్రహీత, లెఫ్టినెంట్ కర్నల్ అర్దేశిర్ బుర్జోర్జీ తారాపోర్ వర్ధంతి నేడు.
1923 ఆగస్టు 18న జన్మించిన తారాపోర్, చిన్ననాటి నుంచే ధైర్యం, క్రమశిక్షణలను అలవరుచుకుని భారత సైన్యంలో చేరారు. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో సియాల్కోట్ సెక్టార్లో జరిగిన తీవ్రమైన ట్యాంకుల పోరాటంలో ‘పూణే హార్స్ రెజిమెంట్’ కమాండింగ్ ఆఫీసర్గా ఆయన ముందుండి నడిపించారు. శత్రువుల వద్ద శక్తివంతమైన ప్యాటన్ ట్యాంకులు ఉన్నప్పటికీ, తన సెంట్యూరియన్ ట్యాంకులతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. గాయపడినప్పటికీ వెనక్కి తగ్గక, తన దళాలలో స్ఫూర్తి నింపుతూ శత్రు స్థావరాలను మట్టికరిపించారు.
1965 సెప్టెంబర్ 16న శత్రువుల దాడిలో ఆయన ఉన్న ట్యాంక్కు మంటలు అంటుకోవడంతో యుద్ధభూమిలోనే తారాపోర్ వీరమరణం పొందారు. దేశం కోసం ఆయన చేసిన అపారమైన త్యాగానికి గానూ భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక పురస్కారమైన ‘పరమవీర చక్ర’తో గౌరవించింది. “తాను బతకకపోతే అంత్యక్రియలు యుద్ధభూమిలోనే జరగాలి” అని కోరుకున్న ఆ మహావీరుడి ఆఖరి కోరిక నెరవేరింది. ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ E6TV నివాళులు అర్పిస్తోంది.

