హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవెల్లి నివాసంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ ధార్మిక క్రతువులో కేసీఆర్, ఆయన సతీమణి శోభలతో పాటు కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా పాల్గొని తాత, నానమ్మలతో కలిసి ఏకదంతుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ వారు మట్టి వినాయకుడికే పూజలు నిర్వహించడం విశేషం.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించి విజయాన్ని అందించే దేవుడిగా గణేశుడికి హిందూ సంప్రదాయంలో తొలి పూజ అర్పిస్తామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం తిరిగి గాడినపడి పాడిపంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు కేసీఆర్ వెల్లడించారు.

