హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీన ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ శాసనసభలో భారతీయ జనతా పార్టీ (BJP) వాయిదా తీర్మాన నోటీస్ ఇచ్చింది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుంచి విమోచనం లభించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజుకు తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. నిజాం సంస్థానంలో భాగంగా ఉండి, ఆ తర్వాత మహారాష్ట్రలో కలిసిన జిల్లాల్లో కాంగ్రెస్ హయాంలోనే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో మాత్రం దీనికి సరైన గుర్తింపు ఇవ్వలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారికంగా ఉత్సవాలు జరపాలని డిమాండ్ చేశారు.

