తెలంగాణలో త్వరలో ఖాళీ కాబోతున్న రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు నూతన ఓటర్ల నమోదు షెడ్యూల్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. వరంగల్-ఖమ్మం–నల్గొండ మరియు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాల ప్రతినిధుల పదవీ కాలం మార్చి 2027తో ముగియనుండటంతో ఈసీ ముందస్తు కసరత్తు ప్రారంభించింది.
ఓటర్ల నమోదుకు సంబంధించిన ముఖ్యాంశాలు:
- అర్హత తేదీ: 1 నవంబర్ 2026 నాటికి డిగ్రీ పూర్తయిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.
- పాత ఓటర్లు కూడా మళ్లీ అప్లై చేయాల్సిందే: గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారు కూడా ఈసారి తప్పనిసరిగా ఫారమ్-18 (Form-18) ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. పాత జాబితా నేరుగా అమలులోకి రాదు.
- దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు సీఈఓ అధికారిక వెబ్సైట్ (
ceotelangana.nic.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఫారమ్ను పూర్తి చేసి, డిగ్రీ సర్టిఫికెట్ల కాపీలతో ఈఆర్వో (ERO) / ఏఈఆర్వో (AERO) అధికారులకు నేరుగా గానీ, పోస్ట్ ద్వారా గానీ సమర్పించవచ్చు.
కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది.

