నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: శివ ఠాకూర్)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొని ఆశీర్వాద దీపాలను వెలిగించి ప్రధానమంత్రి జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఆయనకు కలగాలని, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సుపరిపాలన సేవా సంకల్పంతో ముందుకు సాగుతున్న సందర్భంగా ఈ దీపాల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
హంగు ఆర్భాటాలకు దూరంగా, ఆధ్యాత్మికత మరియు సేవా భావాన్ని ప్రతిబింబించేలా రైల్వే స్టేషన్ ప్రాంతంలో దీపాలను వెలిగించి ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.




