గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు
మద్నూర్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి)
మండల కేంద్రంలోని కుమార్ గణేష్ మండపాన్ని శనివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డితో పాటు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో కొనసాగాలని ఆకాంక్షించారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి, బిచ్కుంద ఎస్సై రాజు, తహసీల్దార్ ముజీబ్, ఫైర్ ఆఫీసర్ మదన్, లీడింగ్ ఫైర్మెన్ నరేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే ఉప సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, గణేష్ మండలి నిర్వాహకుడు రఘు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.అధికారులు కుమార్ గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతి, భక్తి, సోదరభావంతో విజయవంతంగా కొనసాగాలని మండలి నిర్వాహకులు ఆకాంక్షించారు.




